రైలు (Train) ప్రారంభం-eastmedia
మే 3 ,1830
ప్రతీ రోజూ ప్రయాణీకులను తీసుకువెళ్ళటానికి, ఆవిరితో నడిచే రైలు సేవలు,మొదటి సారిగా మొదలయ్యాయి.
రైలు ( Train) అనగా ఒకదాని వెనుక ఒకటి తగిలించబడిన బోగీలతో పట్టాల మీద ప్రయాణిస్తూ, ప్రయాణీకులను లేదా సరుకులను ఒకచోటు నుంచి మరొక చోటకి చేరవేసే ఒక రవాణా సాధనం. దీనిని గ్రాంథిక భాషలో ధూమశకటం అని కూడా అంటారు. ఈ రైళ్ళు పోయే మార్గమును రైలు మార్గము అంటారు. మొట్టమొదట ఆవిరి యంత్రాన్ని స్కాట్లాండు దేశానికి చెందిన జేమ్స్ వాట్ (James Watt) అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూ "గ్లాస్ గో(Glasgow)" విశ్వవిద్యాలయంలో 1776లో కనుగొన్నాడు. దీన్ని ఆధారంగా చేసుకొని అనేక మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా రైలు ఇంజను, రైలు మార్గములు రూపొందించబడినవి.
ఆవిరి ఇంజన్ల చరిత్ర
అమెరికాలో ఆలివర్ ఇవాన్స్ అనే ఇంజనీరు, ఎడింబరోలో విలియం సైమింగ్టన్ ఆవిరితో నడిచే వాహనాలను నిర్మించారు. కానీ రోడ్లు సరిగా లేనందున వాటి ఉపయోగం కనిపించలేదు. 1790 ప్రాంతంలో రిఛర్ట్ ట్రెవితిక్ అనే గనుల ఇంజనీరు తన ప్రయోగశాలలో కొన్ని వాహనాల నమూనాలు చిన్న పరిమాణంలో నిర్మించాడు. 1801 లో ఓ పెద్ద వాహనాన్ని నిర్మించాడు. ఇది ఇనుముతో చేయబడింది. మధ్య భాగంలో పొగగొట్టం, ప్రయాణీకులు కూర్చోవటానికి దాని చుట్టూ కొన్ని సీట్లు ఉండేవి. అందరూ కలిసి ప్రయాణం చేద్దామని మిత్రులను ఆహ్వానించాడు. కొన్ని వందల గజాల వరకు వాహనం వేగంగా చలించినప్పటికీ, ఆ తరువాత చెడిపోయిన కారణంగా ఒక హోటల్ ఆవరణ లోకి అది చొచ్చుకుని పోయింది. ట్రెవితిక్, అతని స్నేహితులు అక్కడ భోజనం చేస్తూండగా ఏదో చెడువాసన వచ్చింది. ట్రెవితిక్ నిప్పును ఆర్పివేయటం మరచిపోయాడు. దాంతో బాయిలర్ ఖాళీ అయిపోయి, మొత్తం వాహనం భగ్గుమని మండింది.
1803 లో అతడు మరో నమూనాను తయారుచేసి కార్న్ వాల్ నుంచి లండన్ వరకు రోడ్డు పై తానే నడుపుకుంటూ వచ్చాడు. అయితే లండన్ చేరేసరికి ఇంజన్ బాగా అరిగిపోయింది. ఇలాంటి వాహనానికి రోడ్డు కంటే రైలు మార్గమే బాగుంటుందని అతడు ఆలోచించాడు. దక్షిణ వేల్స్ లో కార్డిఫ్ దాకా మంచి ట్రాం మార్గం ఉండటాన్ని గమనించిన ట్రెవితిక్ దానిపై వెళ్లటానికి అనువుగా చక్రాల వాహనాన్ని నిర్మించాడు. పది టన్నుల ఇనుమును 70 మంది ప్రయాణీకులను 5 రైలు పెట్టెలలో ఈ వాహనం లాక్కెళ్ళింది. ఇది 19 మైళ్ల రైలు మార్గాన్ని 2 గంటలలో దాటగలిగింది.
ఇదొక మంచి ప్రయత్నమని ట్రెవితిక్ కి నమ్మకం కలిగింది. కానీ గ్రామీణ ప్రజల్లో దీనిపట్ల అభిరుచిని పెంపొందించటం ఎలా అని ఆలోచించి, 1808 లో యూస్టన్ చౌక్ వద్ద ఒక వృత్తాకార రైలు మార్గాన్ని నిర్మించి, అందులో ఒకసారి ప్రయాణానికి ఒక షిల్లింగ్ రుసుముగా నిర్ణయించాడు. లండన్ ప్రజలు అత్యాసక్తితో దీని చుట్టూ తండోపతండాలుగా చేరారు. కానీ కొద్ది రోజుల్లోనే ఒక చక్రం పగిలిపోయి వాహనం బోల్తా పడటంతో కార్యక్రమం మధ్యలోనే ఆగిపోయింది. ఆ రోజు నుంచీ దురదృష్టం అతణ్ణి వెంటాడుతూనే వచ్చింది. టైఫాయిడ్ రావటం, చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవటం, పెరు దేశానికి వలస పోవటం, అక్కడ అంతర్యుద్ధం మొదలయ్యేసరికి చిలీ కి, అక్కడనుండి కొలంబియాకి వెళ్ళటం, అనుకున్నవేవీ జరగకపోగా మళ్ళీ ఐరోపాకి తిరిగి వచ్చి 1833 లో తన 62 వ యేట కటిక దరిద్రంలో చనిపోవటం అన్నీ తలవని తలంపుగా జరిగిపోయాయి. అయితే తాను చేయలేని పనిని జార్జ్ స్టీఫెన్సన్ చేయగలగడాన్ని చూసే వరకూ ట్రెవితిక్ బ్రతికే ఉన్నాడు.
స్వయంచాలక యంత్రం
స్వయంచాలక యంత్రాన్ని కనుగొన్న కీర్తి ఏ ఒక్కరిదీ కాదు. సమస్త యాంత్రిక ఇంజనీర్ ల జాతికీ అది దక్కుతుంది." అని అన్నాడు రాబర్ట్ స్టీఫెన్సన్. ఇక్కడ జాతి అనే పదం అన్ని దేశాలకూ, ఖండాలకూ వర్తిస్తుంది. బ్రిటన్ కంటే చాలాకాలం క్రితం ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో ఆవిరితో నడిచే వాహనాలు నిర్మించబడ్డాయి. కానీ వాటి ఆవశ్యకత అక్కడ కనిపించలేదు. ఫ్రాన్స్ శతఘ్ని దళానికి చెందిన నిలోలస్ జోసఫ్ క్యూనట్ అనే అధికారి ఆవిరితో నడిచే మరో నమూనాను 1763 లో రూపొందించాడు. దాన్ని రోడ్లపై ప్రయోగాత్మకంగా నడిపాడు. కొన్ని ప్రయత్నాల తరువాత అది అడ్డదిడ్డంగా పరిగెత్తి బోల్తా పడింది. ఇతర ఇబ్బందులు రాకుండా దాన్ని ఆయుధాల గిడ్డంగిలోనే తోసి తాళం వేయటంతో పరిశోధన స్తంభించిపోయింది.
-eastmedia™
Comments
Post a Comment